ముగించు

జిల్లా విపత్తు నిర్వహణ

 

ప్రకృతిలో ఆకస్మాత్తుగా సంభవించే పరిణామాల వలన జరిగే అపార నష్టం, వినాశనాలను “విపత్తు”గా పరిగణిస్తారు.

 

  • విపత్తు నిర్వహణ:

లభ్యమగు వనరులను సంస్థాగతం చేసి అత్యవసర పరిస్థితులలో మానవీయ విలువలతో బాధ్యతలను నిర్వర్తించుటలో  విపత్తు సమయంలో ప్రధానంగా స్పందించి విపత్తు నష్టాలను తగ్గించు ప్రక్రియను “విపత్తు నిర్వహణ” అంటారు.

 

  • జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ :

జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీని ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms No.1436, రెవిన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం, తేది : 14.11.2007 మేరకు దిగువ పేర్కొన్న అధికారులతో ఏర్పాటు చేయడమైనది.

 

1. కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్ : చైర్ పర్సన్, Ex-Officio
2. జిల్లా పరిషత్  చైర్ పర్సన్ : కో- చైర్ పర్సన్
3. సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ : సభ్యులు
4. సంయుక్త కలెక్టరు : నిర్వాహక సభ్యుడు & జిల్లా అథారిటీ ముఖ్య కార్య నిర్వహకాధికారి
5. పధక సంచాలకులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ : సభ్యులు
6. ముఖ్య కార్య నిర్వహణాధికారి, జిల్లా పరిషత్ : సభ్యులు
7. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి : సభ్యులు

జిల్లాలో ఈ క్రింది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.

  1. కరువు
  2. వరదలు / భారీ వర్షాలు
  3. వడగాలులు

 

  1. కరువు:

అనావృష్టి మరియు సాధారణం కంటే తక్కువ వర్షపాతము కరువుకు ప్రధాన కారణము. ముఖ్యముగా సకాలములో వర్షాలు పడక పోవడం, సుధీర్ఘ పొడి వాతావరణం, నీటి వనరులు ఎండిపోయి నీటి సరఫరా లేకపోవడం, పంటలు ఎండి పోవడం, జంతువులు చనిపోవడం, పోషకాహార-లోపం మరియు అనారోగ్యకరమైన వాతావరణం వంటివి కరువు వలన ఏర్పడును. భూగర్భ-జలాల మట్టం తగ్గిపోవటం, భూమి క్షారవంతం కావటం, వాతావరణం మరియు నీరు కాలుష్యమవడం వలన ప్రాంతీయంగా కొన్ని జంతు జాతులు అంతరించటం వంటి పరిణామాలు కలుగును.

గత 23 సంవత్సరాలలో,  19 సంవత్సరాలు మన జిల్లాలో  కరువు సంభవించింది.

కరువుకు సంబంధించి ప్రధానంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్యం, స్త్రీ మరియు శిశు సంక్షేమ, పౌర సరఫరా, భూగర్భ జలాలు, గ్రామీణాభివృద్ధి సంబంధిత శాఖలు కరువు పరిస్థితుల నుండి బయట పడేందుకు వివిధ చర్యలు చేపడతారు.

2018-19 ఖరిఫ్ సీజన్ లో జిల్లాలోని మొత్తం 51 మండలాలను మరియు రబీ సీజన్ లో 43 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగినది. జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని ప్రధాన శాఖల వారు తగిన చర్యలు తీసుకోవటం జరిగింది.

2. వరద / భారీ వర్షాలు:

ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం వరదలను దిగువ విధంగా నిర్వచించారు. “నదీ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు, అధిక గాలులు, తుఫానులు వంటి పరిస్థితుల వలన జలాశయంలో నీటి మట్టం పెరగడం, తీరం వెంబడి తుఫాను, సునామి మరియు మంచు లేదా ఆనకట్ట పేలుళ్లు  ద్వారా తాత్కాలికంగా ఎక్కువ ప్రాంతాలలో జరిగే నష్టంగా నిర్వచించింది. అంతే కాక భూమి మునిగిపోయేలా విస్తారంగా నీరు ప్రవహించడాన్ని కూడా వరదగా నిర్వచించవచ్చును.

  • 2001, 2005, 2009, 2010 మరియు 2015 సంవత్సరములలో జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.

 

  • అక్టోబర్ 2001లో, ఈశాన్య ఋతుపవనాల సమయంలో భారీ వర్షపాతం కారణంగా పాపాగ్ని, కుందు, బహుదా మరియు సగిలేరులలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలలో నీరు ప్రవహించి భారీ నష్టాన్ని అనగా, 73,488 ఇల్లు దెబ్బతిన్నాయి మరియు 63 మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాక 9,508 హెక్టార్ల వ్యవసాయం మరియు ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి.

 

  • భారీ వర్షాలు కురిసిన కారణంగా కడప పట్టణానికి 7 కి.మీ దూరంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్టుకు 15.10.2001 రాత్రి భారీ నీటి ప్రవాహం వచ్చి చేరింది. అందువలన వరద నీటిని బుగ్గవంకలోనికి విడుదల చేశారు.

 

  • ఉద్దిమడుగు వంక మరియు రాళ్లవంక ద్వారా అధికంగా వర్షపు నీరు ప్రవహించటం మరియు బుగ్గవంక ప్రాజెక్టు నుండి బుగ్గవంకలోకి వరద నీటిని విడుదల చేయడం వలన కడప పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ఆకస్మిక వరదతో రెండు రోజుల పాటు ఎటువంటి సమాచార ప్రసారం లేకుండా మునిగిపోయింది.

 

  • అగ్నిమాపక సేవా సిబ్బంది రక్షణ మరియు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొని, అనేక మందిని రక్షించి, నివాస గృహాలు, కార్యాలయాలు మరియు ఇతర నివాస భవనాల నుండి నీటిని తోడి వేశారు. అగ్నిమాపక శాఖ  ఫైర్ ఇంజన్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేశారు.

 

  • అక్టోబర్ 2009లో, కుందు నదిలో మునుపెన్నడూ ఎరుగని (గతంలో రాని) వరదలు వచ్చినందున కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణం ఇతర ప్రాంతాల నుండి  5 రోజులు వేరు చేయబడింది. ఫలితంగా, కుందు నది నీరు దాని అనుబంధ వాగులు/వంకల ద్వారా కడప జిల్లాలోకి ప్రవేశించి కుందు పరీవాహక గ్రామాలలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టాన్ని కలిగించాయి. సుమారు 2,302 ఇల్లు దెబ్బతిన్నాయి, 8,104 హెక్టార్ల వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 52.35 కి.మీ మేర పంచాయతి రాజ్ రోడ్లు మరియు 99 భవనాల శాఖ రోడ్లు దెబ్బతిన్నాయి.

 

  • నవంబర్ మరియు డిసెంబర్, 2010లో భారీ వర్షాలు కురిసి 90,158 హెక్టార్ల వ్యవసాయం మరియు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది మరియు జిల్లాలో 343 పశువులు మరణించాయి.

 

  •  జిల్లాలో 2015లో కడప, రాజంపేట రెవిన్యూ డివిజనల్ లలో భారీ వర్షాలు కురిశాయి. ఈ రెండు డివిజన్లలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఆర్థిక సహాయం అందింపబడింది.

 

  • 2018 మార్చి 30న, శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మండలంలో భారీ గాలులు వీచి, సిమెంట్ రేకులు మీద పడటం కారణంగా నలుగురు (4)  వ్యక్తులు మరణించగా, 39 మంది గాయపడ్డారు.

 

  • మరుసటి సంవత్సరం (2019)లో, ఆ దురదృష్టకర సంఘటన మరల పునరావృత్తం కాకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగినది. ముందుజాగ్రత్త చర్యగా ఎన్.డి.ఆర్.ఎఫ్ (NDRF) Rescue బృందాలను పిలిపించడం జరిగినది. వాతావరణం అనుకూలించడంతో స్వామి వారి కళ్యాణం ప్రశాంతంగా జరిగింది.  NDRF బృందం చేత Mock Drills నిర్వహింప చేసి, విపత్తులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రజలలో ముఖ్యంగా విద్యార్థులకు అవగాహనా కల్పించడం జరిగింది. అగ్నిమాపక శాఖ వారు కుడా పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదాలను నివారించవచ్చునో అవగాహన కల్పించారు.

 

3. వడ గాలులు:

 

సుధీర్ఘ కాలం అసాధారణమైన వేడి వాతావరణం కొనసాగడం వలన వీచే వేడి గాలులను “వడ గాలులు” గా పరిగణిస్తారు. వడ గాలుల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని పొందుతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.

జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన వేడి గాలులు వీచటం సర్వ సాధారణం. వడగాలి ప్రభావాన్ని ప్రజల మీద తగ్గించడానికి, వడగాలుల నుండి రక్షింపబడటానికి / తట్టుకోవటానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి జిల్లాలో ఈ క్రింది చర్యలు సంబంధిత శాఖల ద్వారా చేపట్టబడుచున్నవి.

 

  1. పలు ప్రాంతాలలో చలి వెంద్రాల  ఏర్పాటు
  2. గ్రామీణ మరియు పట్టణ  ప్రాంతాలలో  ట్యాంకర్ ద్వారా త్రాగు నీటి సరఫరా.
  3. ప్రజలకు ఉచితంగా మజ్జిగ సరఫరా.
  4. వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో  అవగాహన శిభిరాలు మరియు వైద్య శిభిరాలను నిర్వహించడం.
  5. వేసవిలో “చేయదగిన” మరియు “చేయకూడని” పనులు (Do’s & Dont’s) గురించి కర పత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం. జిల్లాలోని ప్రముఖ స్థలాల్లో పోస్టర్లను అతికించటం / ప్రదర్శించటం.

 

విపత్తు సంసిద్దత:

విపత్తు సంసిద్దత యొక్క ప్రధాన పరికరాలు క్రింది శాఖల వద్ద అందుబాటులో ఉన్నాయి.

  1. అగ్నిమాపక శాఖ
  2. మత్స్య శాఖ
  3. వైద్య మరియు ఆరోగ్య శాఖ

 

  1. జిల్లా అగ్నిమాపక కార్యాలయములో అందుబాటులోనున్న ఫోమ్ టెండర్లు, అడ్వాన్సు టెండర్లు, వాటర్ టెండర్లు, మిస్ట్ జీపులు, మిస్ట్ బుల్లెట్లు, ఫైర్ రూట్స్ మొదలైనవి సకాలంలో విపత్తు నివారించడానికి ఉపయోగిస్తారు.
  2. వరదల సమయంలో బాధితులకు సహాయ పడటానికి మత్స్య శాఖ గజ ఈతగాళ్ళతో పాటు లైఫ్ జాకెట్లు మరియు నాటు పడవలతో సిద్దంగా ఉంది.
  3. వైద్య మరియు ఆరోగ్య శాఖ విభాగాలు మందు మరియు ప్రధమ చికిత్స వస్తు సామగ్రిని సరఫరా చేస్తాయి. స్పైన్ బోర్డులు, స్ట్రెచర్, ఇంక్యుబెటర్, పోర్టబుల్ వెంటిలేటర్లు మొదలైనవి అత్యవసర సమయంలో ఆరోగ్య శాఖ సరఫరా చేస్తాయి. వివిధ శాఖల ద్వారా విపత్తులను ఎదురుకోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉన్నది.